ఇక పై రైల్వే టికెట్ ధరకు యూజర్ చార్జీలు అదనం

ప్రయాణికుల నడ్డి విరిచేందుకు ఇండియన్ రైల్వే సిద్దమయింది, ఇక మీదట విమాన ప్రయాణికుల్లాగే రైల్వే ప్రయాణికులు కూడా యూజర్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రైలు టికెట్ ధరలతో కలిపి యూజర్ చార్జీలు వసూలు చేస్తామని ఇప్పటికే రైల్వేశాఖ ప్రకటించింది. టికెట్‌పై అదనంగా రూ.10 నుంచి రూ.35 మేర భారం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఛార్జీలకు సంబంధించిన ప్రతిపాదనలు రైల్వే శాఖ ఇప్పటికే పూర్తి చేయగా.. త్వరలో కేబినెట్‌ ఆమోదానికి పంపనుంది. ఎంపిక చేసిన స్టేషన్లలో టికెట్‌ ధరకు అదనంగా యూజర్‌ ఛార్జీలు వసూలు చేయనున్నారు.

తరగతుల వారీగా ప్రయాణికుల నుంచి ఈ ఛార్జీలు వసూలు చేసేందుకు రైల్వే శాఖ సమాయత్తమైంది. దిగువ తరగతి ప్రయాణికుడికి ఒకలా.. ఏసీ తరగతికి ఒకలా ఈ యూజర్‌ ఛార్జీలు ఉండబోతున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశంలో 7వేల స్టేషన్లు ఉండగా.. సుమారు 700 నుంచి వెయ్యి స్టేషన్లలో ఈ ఛార్జీల పద్ధతిని ప్రవేశపెట్టనున్నారని సమాచారం. అధిక రద్దీ కలిగి, ఆయా స్టేషన్ల అభివృద్ధి పూర్తయిన తర్వాతే ఈ ఛార్జీలు వసూలు చేయనున్నారు. యూజర్‌ ఛార్జీల గురించి రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌ ఇది వరకే వెల్లడించారు.