మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఏపికి కల్పిస్తాం… కేసిఆర్‌ ఆగ్రహం

తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల విషయంలో ఏపి నిరాదారిత ఫిర్యాదులపై ముఖ్యమంత్రి కేసిఆర్‌ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నీటిపారుదల శాఖపై ఉన్నతాధికారులతో సిఎం కేసిఆర్‌ సమీక్ష నిర్వహించగా…ఈ సమీక్షలోబాగంగా కేంద్ర జలశక్తి శాఖా మంత్రి లేఖ, అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంపై చర్చించారు. అనంతరం కేసిఆర్‌ మాట్లాడుతూ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో సమర్ధవంతంగా వాదనలు వినిపించాలని అధికారులకు సూచించారు. ” నా అంతట నేను ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడా. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మిద్దామని చెప్పాం. బేసిన్లు,భేషజాలు లేవని రాష్ట్ర వైఖరిని చాలా స్పష్టంగా చెప్పా. వృథాగా పోతున్న నీటిని పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామన్నాను. కాని ఏపీ ప్రభుత్వం కావాలని కయ్యం పెట్టుకుంటోంది. ఏపి అర్ధరహిత వాదనలు తిప్పికొట్టేలా సమాధానం చెబుతాం. రాష్ట్ర ప్రాజెక్టులపై మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఏపికి కల్పిస్తాం” అని కేసిఆర్‌ అన్నారు.