కరోనాతో కన్నుమూసిన రచయిత వంశీ రాజేష్

కరోనా మహమ్మారి కారణంగా టాలీవుడ్ స్టోరీ రైటర్ వంశీ రాజేష్ తుది శ్వాస విడిచాడు. గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన రెండు మూడు వారాలుగా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. మూడేళ్ల కింద రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాకు రచయితగా పని చేసాడు వంశీ రాజేష్. దీంతో పాటు మరికొన్ని సినిమాలకు కూడా ఆయన కథా రచయితగా పనిచేశాడు. త్వరలోనే దర్శకుడు కావాలని స్టోరీ సిద్ధం చేసుకుంటున్నాడు వంశీ రాజేష్. ఇలాంటి సమయంలో ఆయన కరోనా బారిన పడ్డాడు. కోలుకుంటున్నట్లు కనిపించినా కూడా ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వంశీ రాజేష్ మృతికి టాలీవుడ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఇంత చిన్న వయసులోనే వంశీ రాజేష్ మరణించడం తోటి రచయితలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో అద్భుతమైన భవిష్యత్తు ఉన్న యంగ్ టాలెంట్ కరోనా వైరస్ బారిన పడి కన్నుమూసిందని.. వాళ్లు ఆవేదన చెందుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు.