కర్ఫ్యూ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న యడియూరప్ప

కరోనా రెండవ దశ వైరస్‌ వస్తోందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ రోజు రాత్రి నుంచి జనవరి 1 వరకు రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తామంటూ బుధవారం సీఎం యడియూరప్ప ప్రకటించిన విషయం తెలిసిందే. రోజూ రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటల వరకు విధించిన కర్ఫ్యూ అమలులోకి రాకముందే నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం గమనార్హం. బ్రిటన్‌లో కొత్త వైరస్‌ ప్రబలడంతో దాని వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా నిపుణుల అభిప్రాయం ఆధారంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని తొలుత నిర్ణయించినట్టు సీఎం యడియూరప్ప ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా కర్ఫ్యూ అమలు చేయాల్సిన అవసరం లేదని భావించినట్టు తెలిపారు. అందుకే కేబినెట్‌ సహచరులు, సీనియర్‌ అధికారులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటనలో వెల్లడించారు.

మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటించడం ద్వారా ఈ వైరస్‌ కట్టడికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, ప్రభుత్వం విధించిన కొవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు.

డిసెంబర్‌ 24 నుంచి జనవరి 1వరకు కర్ణాటక వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు ఆంక్షలు కొనసాగుతున్న సమయంలో బెంగళూరు నగరమంతా 144 సెక్షన్‌ అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు. మరో 5గంటల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు కానుందనగా యడియూరప్ప ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది.