యువగళం – నవశకం బహిరంగ సభకు జాతరలా తరలి రావాలి: గురాన అయ్యలు
విజయనగరం, జగన్రెడ్డి విధ్వంస పాలనకి చరమగీతం పాడేందుకు విజయనగరం జిల్లా నుంచే సమిష్టిగా సమరశంఖం పూరించాలని జనసేన నేత గురాన అయ్యలు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న యువగళం – నవశకం బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా జనసేన నేతలు, జనసైనికులు, వీర మహిళలు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. జిల్లా ప్రజానీకాన్ని ఈ బహిరంగ సభకు సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయోత్సవ సభ డిసెంబరు 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం పోలిపల్లిలో ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన, తెలుగుదేశం పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు.