ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మరోసారి ఆగ్రహం: కేసీఆర్

ఈ నెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన ముఖ్యమంత్రి కేసీఆర్, బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును గట్టిగా వ్యతిరేకించాలని ఆయన అధికారులకు సూచించారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం ఖరారుచేసేందుకు సీఎం కేసీఆర్‌ వీటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, అవసరమైన పత్రాలను సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంగానీ, ఏపీ ప్రభుత్వంగానీ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యక్తంచేసిన అభ్యంతరాలన్నీ అర్థంలేనివే అని కేసీఆర్ అన్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం విషయంలో తమ సంసిద్ధతను వ్యక్తంచేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అజెండాలో చేర్చాల్సిన అంశాలనూ ఆ లేఖలో పేర్కొంటామని చెప్పారు. నిజానికి తెలంగాణలో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన వాటినే తెలంగాణ అవసరాలు తీర్చేలా రీడిజైన్‌ చేశామని కేసీఆర్ చెప్పారు.