బంగ్లాదేశ్ లోని రోహింగ్యా క్యాంపులో అగ్నిప్రమాదం.. 15 మంది సజీవదహనం!

బంగ్లాదేశ్‌ కోక్స్ బజార్‌లోని రోహింగ్యా శరణార్థుల క్యాంపులో జరిగిన అగ్నిప్రమాదంలో 15 మంది సజీవ దహనమయ్యారు. మరో 400 మంది జాడ తెలియడం లేదని ఐక్యరాజ్యసమితి తెలిపింది. అలాగే, మరో 560 మంది వరకు తీవ్రంగా గాయపడినట్టు పేర్కొంది. దాదాపు 45 వేల మంది నివసించే ఈ క్యాంపులో 10 వేలకు పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లన్నీ వెదురు కలపతో నిర్మించడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉందని బంగ్లాదేశ్‌లోని ఐరాస శరణార్థుల ఏజెన్సీ ప్రతినిధి జొహన్నాస్ వాన్ డెర్ క్లావూ తెలిపారు.

మయన్మార్ నుంచి రోహింగ్యాలు వలస వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదేనని అధికారులు తెలిపారు. ప్రమాదంలో నాలుగు ఆసుపత్రులు, ఆరు హెల్త్ సెంటర్లు కాలి బూడిదైనట్టు తెలిపిన అధికారులు, మరణాల విషయంలో స్పష్టమైన ప్రకటన ఏదీ ఇంకా చేయలేదు.