అద్వానీ పుట్టిన రోజు వేడుక‌ల్లో పాల్గొన్న ఉప రాష్ట్రపతి, ప్ర‌ధాని

బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈరోజుతో ఆయన 94వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి వచ్చారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వీరంతా ఒకే చోట కూర్చోని మనసు విప్పి మాట్లాడుకున్నారు.
 
మరోవైపు మోదీ ట్విట్టర్ ద్వారా కూడా అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘గౌరవనీయులైన అద్వానీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షుతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. దేశ ప్రజలను చైతన్యపరచడంలో, మన సంస్కృతిని విస్తరింపజేయడంలో ఆయన చేసిన కృషి చాలా గొప్పది. ఆయన మేధో సంపత్తి ఎంతో గర్వించదగినది’ అని మోదీ పేర్కొన్నారు.
 
1927లో ప్రస్తుత పాకిస్థాన్ లోని కరాచీలో అద్వానీ జన్మించారు. స్వాతంత్ర్యం సందర్భంగా దేశం విడిపోయినప్పుడు ఆయన కుటుంబం కరాచీ నుంచి భారత్ కు తరలి వచ్చింది. మన దేశంలో బీజేపీ అధికారంలోకి రావడానికి అద్వానీ చేసిన కృషి వెలకట్టలేనిది.