చైనా బెదిరింపు యత్నాలను అడ్డుకుంటాం: బైడెన్
పొరుగుదేశాలపై చైనా ప్రదర్శిస్తున్న దుందుడుకు వైఖరిపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న చర్చలు శాంతియుత పరిష్కారానికి బాటలు వేయాలని బైడెన్ పాలకవర్గం ఆకాంక్షించింది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి సోమవారం విలేకరులతో మాట్లాడారు.
చైనా బెదిరింపు యత్నాలను అడ్డుకుంటామని అమెరికా తెలిపింది. ఈ క్రమంలో అమెరికా మిత్రదేశాలు, భాగస్వామ్యపక్షాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తామని తెలిపింది. బైడెన్ పాలక వర్గం బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై మాట్లాడడం ఇదే తొలిసారి.
ఇటీవల పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. వాస్తవాధీన రేఖ వెంట సైనిక బలగాలను బలోపేతం చేసినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. గల్వాన్ ఘటన తర్వాత ఉభయ దేశాల మధ్య పరిస్థితులు క్షీణించడంతో సైనిక బలగాలు నిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఇటీవల మరోసారి ఇరుదేశాల సైనికులు సరిహద్దుల్లో స్వల్ప స్థాయి ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అమెరికా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.