జనతా కర్ఫ్యూకి ఏడాది

జనతా కర్ఫ్యూ.. కరోనా వైరస్‌ దెబ్బకు దేశమంతా తొలిసారి జనతా కర్ఫ్యూ ప్రకటించి నేటికి సరిగ్గా ఏడాది అవుతోంది. గత ఏడాది మార్చి 22న అంటే ఇదో రోజున కొవిడ్‌ వ్యాప్తిపై అవగాహనతో పాటు, వైద్యులకు సంఘీభావం తెలిపేందుకు ప్రధాని మోడీ ఒక రోజు జనతా కర్ఫ్యూ విధించారు. మార్చి 25 నుంచి దేశమంతా 23 రోజుల పాటు లాక్‌డౌన్‌ మొదలైంది. తర్వాత రెండో విడతలో ఏప్రిల్‌ 15 నుంచి మే 3 వరకు, మూడో విడతలో మే 4 నుంచి 17 వరకు, చివరిగా మే 18 నుంచి 31 వరకు దాన్ని పొడిగిస్తూ వచ్చింది. ఆ తర్వాత జూన్‌ 1 నుంచి అన్‌లాక్‌ప్రక్రియను ప్రారంభించి, దశలవారీగా దాన్ని కొనసాగిస్తూ వచ్చింది.

కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపిస్తున్న సమయంలో దానిపై ముందు వరుసలో నిలబడి పోరాటం చేస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. దీపాలు వెలిగించాలని మోడీ కోరారు. దాన్ని పాటిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలంతా రాత్రి కొన్ని నిమిషాల పాటు లైట్లు ఆపి, దీపాలు వెలిగించారు. ఆ తర్వాత మరో సందర్భంలో పళ్ళాలు మోగిస్తూ, మరోసారి ఆరోగ్య సిబ్బందికి సంఘీభావం ప్రకటించాలని సూచించారు. ఓ వైపు ప్రజలను చైతన్య పరుస్తూ… వివిధ రాష్ట్రాల సీఎంలతో సమావేశాలు నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తూ వచ్చారు. రాష్ట్రాలు సైతం.. లాక్ డౌన్‌ కఠినంగా అమలు చేస్తూ, వైరస్‌పై అలుపెరుగని పోరాటం చేశాయి. దాని ఫలితంగా కరోనా వైరస్‌ వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఓ దశలో దేశంలో లక్ష కేసులు వెళ్లిన… క్రమంగా పదివేల దిగువకు పడిపోయింది.

నవంబర్ నెల నుంచి కాస్త కేసులు నెమ్మదిస్తూ వచ్చినా, మళ్లీ ఈ ఏడాది మార్చి నెలలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఓ దశలో పదివేలకు దిగువకు పడిపోయిన కేసులు.. రెండు రోజులుగా 40 వేలకు చేరుతున్నాయి. దీంతో వివిధ రాష్ట్రాలలోని కొన్ని నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నారు.ఇప్పటికే మహారాష్ట్రలోని కొన్ని నగరాల్లో లాక్‌డౌన్ విధించగా.. తాజాగా మధ్యప్రదేశ్‌లోని మూడు నగరాల్లో ప్రతి ఆదివారం లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో ఆరేడు రాష్ట్రాల్లో అధిక కేసులు వెలుగుచూస్తున్నాయి. మూడు రోజుల్లో లక్ష కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా లోకల్‌ ట్రైన్స్‌తో పాటు, జనసమూహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త కేసులు ఎక్కువగా వస్తున్నట్లు తేలింది. మన దగ్గర కూడా విద్యా సంస్థలు, హాస్టళ్లు, గురుకులాల్లో వైరస్‌ వ్యాప్తి ఇటీవల బాగా పెరిగింది. ప్రజలు మాస్కులు ధరించకపోవడం, సమూహాలుగా ఉండటం, టీకా తీసుకునేందుకు సంకోచించడంతో వైరస్‌ మళ్లీ విజృంభిస్తోందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాంతో ఏడాది నాటి పరిస్థితులు కొన్ని రాష్ట్రాలో నెలకొన్నాయి. కొన్నిచోట్ల పూర్థిస్థాయిలో లాక్‌డౌన్‌ విధిస్తుండగా, మరికొన్ని చోట్ల పాక్షికంగా కర్ప్యూలాంటి చర్యలకు ఆయా రాష్ట్రాలు దిగుతున్నాయి.

మరోవైపు… తెలుగు రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏపీ, తెలంగాణల్లో వివిధ జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలో కేసుల సంఖ్య ఎంత పెరిగినప్పటికీ దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ భారీగా కేసులు పెరిగినా, సర్కారుకు లాక్‌డౌన్‌ విధించాలన్న ప్రతిపాదనలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయబోమని అధికారి వెల్లడించారు. గతంలో లక్ష కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు మౌలిక సదుపాయాల కల్పన చేసుకున్నామని, ప్రస్తుతం అటువంటి పరిస్థితులు రాకపోవచ్చని అంటున్నారు. తాజాగా రాష్ట్రంలో పది ప్రాంతాల్లో వైరస్‌ అవుట్‌ బ్రేకు అవ్వగా, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా విస్తృతమైన టెస్టులు చేసి కట్టడి చేయగలిగారు.