76 దేశాలకు 6 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు ఎగుమతి చేసిన భారత్

ఇప్పటి వరకు 76 దేశాలకు 6 కోట్లకు పైగా కరోనా టీకా డోసులను ఎగుమతి చేసినట్టు కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. అలాగే, దేశవ్యాప్తంగా 4.5 కోట్ల డోసులు ఇచ్చినట్టు తెలిపింది. నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 25.40 లక్షల డోసులను పంపిణీ చేసినట్టు వివరించింది. ఇప్పటి వరకు పంపిణీ చేసిన టీకాల్లో 3.71 కోట్ల మంది తొలి డోసు తీసుకున్నారని, 74 లక్షల మంది రెండో డోసు తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.

ఇక, ప్రపంచవ్యాప్తంగా 133 దేశాలు 43 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. పెద్ద ఎత్తున వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటి వరకు అమెరికాలో 12 కోట్ల డోసులను పంపిణీ చేశారు. చైనాలో 6.49 కోట్ల డోసులు, యూరోపియన్ యూనియన్ 5.60 కోట్ల డోసులు పంపిణీ చేయగా, మన దేశంలో ఇప్పటి వరకు 4.5 కోట్ల డోసులు పంపిణీ చేశారు.