మోడీతో కలిసి వేదికను పంచుకున్న నృత్యగోపాల్‌దాస్‌కు కరోనా

రామజన్మభూమి ట్రస్ట్‌ సారథి నృత్యగోపాల్ దాస్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇటీవల జరిగిన అయోధ్య రామాలయ భూమిపూజలో పాల్గొని కార్యక్రమాలను ఆయనే దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించిన విషయం అందరికీ తెలిసిందే. మోడీతో కలిసి ఆయన వేదికను పంచుకున్నారు. కృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా నృత్యగోపాల్‌ దాస్ ప్రస్తుతం మథురలో ఉంటున్నారు.

ఆరోగ్య సమస్యలు రావడంతో ఆయనకు వైద్యులు కరోనాతో పాటు పలు పరీక్షలు చేశారు. దీంతో ఆయనకు కొవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. నృత్యగోపాల్ దాస్‌కు కరోనా సోకిన విషయాన్ని తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఇప్పటికే మథుర డీఎంతో మాట్లాడినట్లు ఆ రాష్ట్ర సీఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రామాలయ భూమిపూజ కార్యక్రమంలో ఆయనతో పాటు యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌తో పాటు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ సహా పలువురు హాజరయ్యారు.