కోవిడ్‌ సమయంలో అమెరికా సాయానికి కృతజ్ఞతలు: కమలా హారీస్‌తో మోడీ భేటీ

మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో తొలిసారి శ్వేతసౌధంలో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలవడం చారిత్రాత్మకమన్నారు. ప్రపంచానికి ఆమె ఒక స్ఫూర్తి అని ప్రశంసించారు.

ఇక భారత్-అమెరికా సహజ భాగస్వాములన్నారు. రెండు దేశాలు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని, రెండూ ఒకేరకమైన విలువలు, భౌగోళికమైన రాజకీయ ప్రయోజనాలు కలిగి ఉన్నాయని అన్నారు. భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో సహకరించినందుకు ఈ సందర్భంగా అమెరికాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

అధ్యక్షుడు బైడెన్, కమల నేతృత్వంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థానానికి చేరుకుంటాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమలా హారిస్‌ను మోదీ భారత్ పర్యటనకు ఆహ్వానించారు. కమలా హారిస్ మాట్లాడుతూ.. అమెరికాకు భారత్ ప్రత్యేక భాగస్వామి అన్నారు. కరోనా ప్రారంభంలో టీకాలకు భారత్ వనరుగా ఉందని అన్నారు. టీకా ఎగుమతుల పునరుద్ధరణపై భారత్ చేసిన ప్రకటనను కమల స్వాగతించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత మన దేశాలపైనే ఉందని కమల అన్నారు.