దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి ఉచిత కరోనా వ్యాక్సిన్
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ టీకాను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్దన్ కీలక ప్రకటన చేశారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా అందజేస్తామని తెలిపారు. వ్యాక్సిన్ సేఫ్టీపై ఎలాంటి రూమర్లు, అపోహలను నమ్మొద్దని ప్రజలను కోరారు. ఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ ఆస్పత్రిలో నిర్వహించిన వ్యాక్సిన్ డ్రై రన్ డ్రిల్లో హర్ష వర్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ను అందజేస్తామని స్పష్టం చేశారు. తొలుతగా 1 కోటి మంది హెల్త్కేర్, 2 కోట్ల ఫ్రంట్లైన్ వర్కర్స్కు వ్యాక్సినేషన్ చేస్తామని చెప్పారు. జూలైలోపు 27 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తామని పేర్కొన్నారు.