ప్రతి సమస్యపై లోతైన అధ్యయనం

* పిఠాపురం నియోజక వర్గం ప్రముఖులతో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ భేటీ
* జనసేన వారాహి విజయ యాత్రలో సరికొత్త అంకం

క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే సమస్య మూలాలు అర్థమవుతాయి. దానిని నిపుణులు, సామాజికవేత్తలతో చర్చిస్తే పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. జనసేన వారాహి విజయ యాత్రలో భాగంగా కేవలం బహిరంగ సభలకే పరిమితం కాకుండా ఆయా నియోజకవర్గాల్లో నెలకొని ఉన్న పరిస్థితిని స్వయంగా తెలుసుకుని, లోతైన అధ్యయనం చేసే కార్యక్రమానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రంగాలు వారీగా నెలకొని ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు వివిధ రంగాల ప్రముఖులతో మాట్లాడే కార్యక్రమం గురువారం నుంచి మొదలైంది. గొల్లప్రోలులో గురువారం ఉదయం పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ప్రముఖులు, వ్యాపారులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, డాక్టర్లు, లాయర్లు, స్వచ్చంద సేవకులు, ఇతర రంగాల ప్రముఖులతో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు. ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆయా రంగాల వారీగా నెలకొన్న పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకుని పుస్తకంలో నోట్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితిని తెలుసుకునేందుకు, పిఠాపురం నియోజకవర్గంలోని స్థానిక సమస్యలను అవగతం చేసుకునేందుకు ఆయన ప్రాధాన్యమిచ్చారు. జనసేన ప్రభుత్వం వస్తే నియోజకవర్గానికి ఏం చేయాలి అన్న దాని మీద ప్రముఖులను అడిగి తెలుసుకున్నారు. ప్రాధాన్యత అంశాలు నియోజకవర్గంలో ఏమున్నాయి అన్న విషయంతో పాటు రాష్ట్రస్థాయిలో రంగాల వారీగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రశ్నించి, వారు చెప్పిన పూర్తిస్థాయి వేదనను అర్థం చేసుకునేందుకు అధిక ప్రాధాన్యమిచ్చారు.
* రంగాల వారీగా సమస్యలు
కేవలం సాధారణ సమావేశంలా కాకుండా ఆయా రంగాల్లోని ప్రముఖులతో ఒక్కొక్కరిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక సమయం కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో, అసలు క్షేత్ర స్థాయిలో మారుతున్న జీవన విధానాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, కనీసం తాగు నీరు కూడా దొరకని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు ముందుకు కదలకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సాగునీటి వెతలు ఎక్కువగా ఉన్నాయని శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. సంక్షేమం పేరుతో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేయడంతో గ్రామాల పరిస్థితి దుర్భరంగా ఉందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల జీవన విధానం అస్తవ్యస్తంగా మారిందని, పేదలు మరింత పేదలుగా మారుతూ పన్నులు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు. అన్ని రంగాల్లోనూ తిరోగమనమే తప్ప పురోగమనo లేదంటూ ప్రముఖులు ఉదాహరణలతో సహా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. అన్ని విషయాలను విన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాటిని ప్రత్యేకంగా నోట్ చేసుకొని, వచ్చే జనసేన ప్రభుత్వంలో కచ్చితంగా వీటికి పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ప్రజలు ఏం కోరుకుంటున్నారో వారి జీవన విధానం మెరుగుపరచడానికి ఎలాంటి పాలసీలు తీసుకురావాలో అధ్యయనం చేయడం కోసం ఇలాంటి భేటీలు ఎంతగానో ఉపకరిస్తాయి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల మాటలు వినాలని భావిస్తున్నాం. వారికి ఎలాంటి పాలన విధానాలు కావాలో తెలుసుకుంటున్నాం. పిఠాపురం నియోజకవర్గం ప్రముఖులు చెప్పిన అన్ని విషయాలను విన్నాను. వాటిని అవగతం చేసుకుని, ఈ ప్రాంతం ముందడుగు వేయడానికి చేయాల్సిన ప్రణాళికను త్వరలోనే ప్రకటిస్తాం” అన్నారు.