అసాంఘిక కార్యకలాపాల అడ్డాగా విశాఖ హార్బర్

• రాత్రిళ్లు అటు వైపు వెళ్లాలంటే హడలిపోతున్నాం
• దొంగతనాలు మితిమీరిపోయాయి
• మత్స్యకార మహిళలు హార్బర్ వైపు వెళ్లేందుకు భయపడుతున్నారు
• బోట్లలో పని చేసే మత్స్యకారులకు ఎలాంటి పరిహారం లేదు
• పవన్ కళ్యాణ్ ఎదుట మత్స్యకారుల ఆవేదన
• విశాఖ హార్బర్ ను సందర్శించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్
• అగ్నిప్రమాదంలో దగ్ధమైన బోట్ల పరిశీలన

‘మత్స్యకారుల జీవనోపాధికి అడ్డాగా నిలవాల్సిన విశాఖ హార్బర్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.. రాత్రి సమయంలో హార్బర్ లో అడుగుపెట్టాలంటే భయంతో వణికి పోయే పరిస్థితి.. వేటకు వెళ్లే సమయాన్ని కూడా మార్చేసుకోవాల్సి వచ్చింది..’ ఇదీ.. అగ్ని ప్రమాదానికి గురైన విశాఖ హార్బర్ పరిశీలనకు వెళ్లిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎదుట ఓ మత్స్యకార సోదరుడు వెళ్లగక్కిన ఆవేదన. మత్స్యకారుల జీవనోపాధికి కేంద్ర బిందువు అయిన విశాఖ హార్బర్ లో దిగజారిన పరిస్థితులను కళ్లకు కట్టిన అంశం ఇది. శుక్రవారం అగ్నిప్రమాదంలో బోట్లు దగ్ధం అయిన ప్రాంతాన్ని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, విశాఖకు చెందిన పార్టీ నాయకులతో కలసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు. ఘటనా స్థలిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రమాదంలో కాలిపోయిన బోట్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం తీవ్రత, బోట్లు తగలబడడం వల్ల మత్స్యకారులకు జరిగిన నష్టం, ప్రమాదం తరవాత పరిస్థితులను పార్టీ మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ శ్రీ బొమ్మిడి నాయకర్ తో పాటు స్థానిక నాయకులు, మత్స్యకారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ సీహెచ్ ప్రశాంత్ కుమార్ అనే మత్స్యకార యువకుడు మాట్లాడుతూ “హార్బర్ లో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరిపోయాయి. దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయి. చీకటి పడితే మత్స్యకార మహిళలే కాదు మగవారు కూడా హార్బర్ వైపు వచ్చేందుకు భయపడిపోయే పరిస్థితి. వేకువజామున 3 గంటలకు వేటకు వెళ్లే మేము ఆ సమయాన్ని ఉదయం 6 గంటలకు మార్చుకోవాల్సి వచ్చింది. ప్రమాదంలో నష్టపోయిన బోట్లకు పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం 40 బోట్లకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించారు. ఆ బోట్లలో పని చేస్తూ జీవనం సాగించే మత్స్యకారులకు ఎలాంటి సహాయం చేయలేదు” అని తమ సమస్యలు చెప్పుకున్నారు. ప్రతి అంశాన్ని సాంతం విన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ నిలబడుతుందని భరోసా ఇచ్చారు.
• జనసేనానికి మత్స్యకారుల జేజేలు
హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన మత్స్యకార సోదరులకు అండగా నిలిచేందుకు విశాఖ వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఆధ్యంతం ఉత్కంఠ మధ్య సాగింది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖ చేరుకోవాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆయన రావాల్సిన విమానం రద్దు అయ్యింది. పర్యటన కూడా రద్దు అవుతుందన్న పుకార్లు హల్ చల్ చేశాయి. అయితే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరొక ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో పార్టీ నాయకుల ఘన స్వాగతం అనంతరం అక్కడి నుంచి బయలుదేరి పోర్టు రోడ్డు మీదుగా హార్బర్ కి చేరుకున్నారు. తమకు అండగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్న విషయం తెలుసుకున్న మత్స్యకార సోదరులు, మహిళలు పెద్ద ఎత్తున హార్బర్ కి చేరుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జయ జయ ధ్వానాలతో స్వాగతం పలికారు. కష్టాల్లో తమకు అండగా నిలచిన నాయకుడు అంటూ హారతులు పట్టారు.