విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నా: కేటీఆర్

హైదరాబాద్: విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నేడు ఆయన మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేశారన్నారు. విశాఖ ఉక్కు కోసం చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉందన్నారు. వీలైతే వైజాగ్ వెళ్లి ఉద్యమంలో పాల్గొనేందుకు సైతం సిద్ధమని ప్రకటించారు. తమ అందరి మద్దతు విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకూడదంటూ చేస్తున్న ఉద్యమానికి ఉంటుందని.. పోరాటంలో కలిసి ఉంటామని కేటీఆర్ వెల్లడించారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకూడదంటూ ప్రజానీకం తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్నారు. అసలు ఈ ప్రకటన వచ్చీ రాగానే ప్రజలు తమ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమానికి కేటీఆర్ ప్రకటన మరింత బలాన్నిచ్చినట్టైంది. ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు తెలుగు రాష్ట్రాలు ఒక్కటవ్వాల్సిన ఆవశ్యకతను చాటి చెప్పినట్టైంది.