హిందూపురంలో రెండవరోజూ పర్యటనలో బాలకృష్ణ!

వర్షానికి పంట నష్టపోయిన రైతులను ఆదుకోకుంటే ఢిల్లీ తరహా ఉద్యమం తప్పదని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన నిన్న రెండో రోజు వర్షానికి పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ-క్రాప్ బుకింగ్‌లో తారస్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఏం చెప్పినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కులాలు, మతాల పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేసి పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఆలయాలపై జరుగుతున్న దాడులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఢిల్లీ తరహా రైతు ఉద్యమాన్ని చేపడతామని బాలకృష్ణ హెచ్చరించారు.