ఇక బ్యాంకులు ప్రైవేటు పరం..! షార్ట్ లిస్ట్..!

కేంద్ర ప్రభుత్వం అమ్మకం మోడ్‌లో ఉంది. దొరికినవి దొరికినట్లుగా అమ్మేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఏకాఏకిన ఎంత కుదిరితే అంత ప్రైవేటుకు కట్ట బెట్టడానికి ప్రయత్నిస్తున్న కేంద్రం తాజాగా బ్యాంకుల్ని కూడా ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించుకుంది. నాలుగు బ్యాంకుల్ని అమ్మకానికి పెట్టేలా నిర్ణయం తీసుకుంది. నిజానికి చిన్న బ్యాంకుల్ని పెద్దగా చేస్తామంటూ ఇటీవల బ్యాంకుల విలీనం పూర్తి చేసింది. చిన్న బ్యాంకుల్ని పెద్దవిగా చేసింది. అలా చేసిన వాటిలో నాలుగింటిని ప్రైవేటుకు అమ్మబోతోంది. అంటే. పేరుకు నాలుగే.. కానీ విలీనం కాక ముందు పరిస్థితి చూస్తే అమ్మబోయేది పది బ్యాంకులపైనే.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలను అమ్మాలని కేంద్రం ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఖరారైంది. రెండింటిని వచ్చే ఏడాదిలోనే అమ్మేయబోతున్నారని మీడియా వర్గాలు ధృవీకరించాయి. బ్యాంకింగ్ రంగాన్ని మొత్తం ప్రైవేటీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెబుతున్నారు. తొలుత చిన్న బ్యాంకులు, మధ్య తరగతి బ్యాంకులను ప్రైవేటైజ్ చేస్తారు. తర్వాత పెద్ద బ్యాంకులను కూడా ప్రైవేటుపరం చేసేస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాత్రం ప్రభుత్వం అత్యధిక వాటాను ఉంచుకుంటుందట. అంటే ప్రభుత్వ బ్యాంక్ ఒక్క ఎస్‌బీఐ మాత్రమే ఉంటుంది.

ప్రైవేటును ప్రోత్సహిద్దామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముఖ్యమంత్రులకు మాత్రమే కాదు. సాధారణ ప్రజలకు కూడా పిలుపునిస్తున్నారు. దానికి అందరూ సిద్ధమే కానీ కొత్తగా ప్రైవేటు కంపెనీలు పెట్టాలి కానీ ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటు పరం చేయడం ఏమిటని అంటున్నారు. బ్యాంకుల నుంచి లక్షల కోట్లు తీసుకుంటున్న బడా వ్యాపారులు . అవి తీర్చడం లేదు.దాని వల్ల బ్యాంకుల నిరర్థక ఆస్తులు పెరిగిపోతున్నాయి. కానీ ఆ లోన్ డిఫాల్టర్స్ ఇప్పటికీ ప్రముఖులుగానే చెలామణి అవుతున్నారు. ఇప్పుడు.. అమ్మబోయే బ్యాంకుల్ని ఆ డిఫాల్టర్సే. కన్సార్షియంగా ఏర్పడి కొనుగోలు చేస్తారేమోనని. సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. మొత్తానికి కేంద్రం.. చాలా దూకుడుగా ప్రైవేటు నిర్ణయాలను అమలు చేస్తోంది.