బైడెన్ నాయకత్వానిదే ఈ దశాబ్దంలో కీలకపాత్ర: మోదీ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం ముగిసిన అనంతరం బైడెన్ తో కలిసి సంయుక్తంగా ప్రసంగించారు. బైడెన్ తో ఈ సమావేశం ఎంతో కీలకమైనదని మోదీ పేర్కొన్నారు. బైడెన్ నాయకత్వానిదే ఈ దశాబ్దంలో కీలక పాత్ర అని అభిప్రాయపడ్డారు.

బైడెన్ హయాంలో భారత్, అమెరికా దేశాల బంధం మరింత బలోపేతం కావాలని మోదీ ఆకాంక్షించారు. ఇరుదేశాల మధ్య వ్యాపార భాగస్వామ్యం మరింత పటిష్టమవ్వాలని, ఇరుదేశాల వాణిజ్య బంధానికి ఎంతో ప్రాధాన్యం ఉందని అన్నారు. భారత్, అమెరికా దేశాలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు.

అటు, బైడెన్ ప్రతిస్పందిస్తూ, భారత్-అమెరికా బంధం ఎంతో కీలమైనదని తాను అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడే చెప్పానని వెల్లడించారు. ప్రపంచంలోనే భారత్, అమెరికా అత్యంత సన్నిహిత దేశాలని ఉద్ఘాటించారు. ప్రపంచ సవాళ్లకు భారత్-అమెరికా బంధం పరిష్కారం చూపాలని అభిలషించారు.