కేరళలో లో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. 12వేల బాతులు మృతి..

దేశంలో బర్డ్ ఫ్లూ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పక్షులు మృత్యువాత పడినట్లు వార్తలు వస్తుండగా కేరళలో ఏకంగా 12 వేల బాతులు బర్డ్ ఫ్లూ వల్ల మృతి చెందినట్లు తెలుస్తోంది. భారీ సంఖ్యలో బాతులు మరణించడంతో అక్కడి స్థానికులు సైతం భయాందోళనకు గురవుతున్నారు.

ఇప్పటికే మరణించిన బాతులను పరీక్షించగా ఆ బాతులలో అధికారులు బర్డ్ ఫ్లూ ఆనవాళ్లను గుర్తించారు. కేరళలోని ముఖ్య జిల్లాలైన కొట్టాయం, ఆలపుళ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. చనిపోయిన బాతుల్లో ఎనిమిది బాతుల నుంచి శాంపిళ్లను సేకరించి ల్యాబ్ కు పంపగా ఐదు బాతుల్లో బర్డ్ ఫ్లూ వ్యాధికి కారణమైన వైరస్ ఆనవాళ్లు కనిపించాయని తెలుస్తోంది. 12వేల బాతులు మృతి చెందిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

బాతులు చనిపోయిన ప్రాంతానికి సమీపంలో ఉన్న వేల సంఖ్యలో బాతులను అధికారులు ఇతర ప్రాంతాలకు తరలించారు. వ్యాధి వ్యాపించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. గతేడాది చివరి వారం నుంచి దేశంలో బర్డ్ ఫ్లూతో ఎక్కువ సంఖ్యలో పక్షులు, బాతులు మృత్యువాత పడుతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే వేల సంఖ్యలో పక్షులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

అధికారులు పదుల సంఖ్యలో పక్షులు, బాతులు మృత్యువాత పడితే ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఇతర ప్రాంతాల పక్షులకు పరీక్షలను నిర్వహించి వాటికి బర్డ్ ఫ్లూ సోకిందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో వైరస్, బ్యాక్టీరియాల వల్ల కొత్త వ్యాధులు వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు.