బీజేపీ నేత ఖుష్బూ ఆస్తుల విలువ రూ. 40.96 కోట్లు

తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బూ నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు మొత్తం 40.96 కోట్ల రూపాయల ఆస్తి ఉందని, ఇందులో రూ. 6.39 కోట్ల విలువైన చరాస్తులు, రూ.34.56 కోట్ల విలువైన స్థిరాస్తులతోపాటు 8.5 కేజీల బంగారం, 78 కేజీల వెండి ఉన్నట్టు పేర్కొన్నారు.

అలాగే, తన భర్త సుందర్ వద్ద 495 గ్రాముల బంగారం, 9 కిలోల వెండి ఉన్నట్టు తెలిపారు. ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న తన వార్షిక ఆదాయం 1.50 కోట్ల రూపాయలని ఖుష్బూ పేర్కొన్నారు. గతేడాది కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఖుష్బూ ఎన్నికల బరిలోకి తొలిసారి దిగుతున్నారు. చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం టికెట్‌ను బీజేపీ అధిష్ఠానం ఆమెకు కేటాయించింది.