పెళ్లి కోసమే బుమ్రా బ్రేక్‌!

భారత జట్టు పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో సెలవు కోరిన బుమ్రా నాలుగో టెస్ట్‌తో పాటు మొత్తం ఐదు టీ20ల సిరీస్‌కు కూడా బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. అసలు కారణం ఏమిటో స్పష్టంగా తెలియకపోయినా… జస్ప్రీత్ బుమ్రా వివాహం కారణంగా సెలవు కోరినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది. ఈ ఫాస్ట్ బౌలర్ త్వరలో వివాహం చేసుకోబోతున్నాడని బిసిసిఐ వర్గాల నుంచి సమాచారం అందినట్లు రాసుకొచ్చింది. వివాహానికి సంబంధించిన పనుల నిమిత్తమే సెలవు తీసుకున్నాడని.. అయితే, పెళ్లి ఎప్పుడు జరగబోతోందో ఇంకా స్పష్టంగా తెలియలేదని వెల్లడించింది. వివాహం అహ్మదాబాద్‌లో మాత్రమే జరుగుతుందని సమాచారం.

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బుమ్రా కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో బుమ్రా చాలా ఓవర్లు బౌలింగ్ చేయడంతో అలసిపోయాడు. దీంతో రెండో టెస్ట్‌కు రెస్ట్ ఇచ్చారు. అహ్మదాబాద్‌లో జరిగిన డే-నైట్ టెస్టులో బుమ్రా తిరిగి ఆడాడు. దీని తరువాత వ్యక్తిగత కారణాల వల్ల సెలవు కోరడంతో.. బిసిసిఐ మంజూరు చేసింది. మొత్తానికి మరో యంగ్ క్రికెటర్ బ్యాచిలర్ లైఫ్‌కు ఎండ్ కార్డ్ వేసి.. పెళ్లిపీటలెక్కబోతున్నాడు.

వన్డే సిరీస్‌కు కూడా దూరంగా

చివరి టెస్టుకు బుమ్రా స్థానంలో మరే ఆటగాడిని చేర్చబోమని బోర్డు స్పష్టం చేసింది. ఇంగ్లాండ్‌తో జరిగే టీ 20 సిరీస్‌కు జస్‌ప్రీత్ బుమ్రా ఎంపిక కాలేదు. అలాగే, వన్డే సిరీస్‌లో కూడా అతను భారత జట్టుకు దూరంగా ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది భారత జట్టు చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ఈ క్రమంలో బుమ్రాకు పెద్దగా సమయం లభించే అవకాశం లేదు.

ఇంగ్లాండ్‌తో సిరీస్ తర్వాత, భారత ఆటగాళ్ళు ఐపీఎల్‌లో బిజీగా ఉంటారు. తర్వాత ఇంగ్లాండ్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆడాల్సి ఉంటుంది. అలాగే, ఈ ఏడాది టీ 20 ప్రపంచ కప్ ఇండియాలో జరగనున్న విషయం తెలిసిందే.