కరోనా కలకలంతో చెన్నై సూపర్ కింగ్స్ క్వారంటైన్‌ను మరో వారం పొడిగింపు

ఐపీఎల్-2020 ప్రారంభం కాకముందే చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో కరోనా కలకలం రేగింది. టీంలోని కొంతమందికి కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. వారిలో ఒక ఫాస్ట్ బౌలర్, 12 మంది సపోర్ట్ స్టాఫ్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ తమ క్వారంటైన్‌ను మరో వారం పాటు పొడిగించినట్లుగా తెలుస్తోంది.

వాస్తవానికి చెన్నై ఈ రోజు నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టాల్సి ఉంది. కరోనా కారణంగా అది కాస్తా ఇప్పుడు కుదరలేదు. ధోనీ సేన ఈ నెల 21న దుబాయ్‌లో అడుగుపెట్టింది. షెడ్యూల్ ప్రకారం ఆరు రోజుల క్వారంటైన్ కూడా పూర్తి చేసుకుంది. ఇక వచ్చే నెల 19న ఐపీఎల్ మొదలుకానుంది. కాగా, చెన్నై సూపర్ కింగ్స్ టీం సభ్యులు, సపోర్ట్ స్టాఫ్‌, ఆఫీషియల్స్‌కు ఇవాళ నాలుగోసారి కరోనా టెస్టులు చేయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే భారత్‌లో మూడుసార్లు చేశారు.