హర్యానా సీఎం ఖట్టర్‌పై రైతుల దాడి

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌పై రైతులు దాడి చేసారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న అన్నదాతలు నల్లజెండాలు చూపి నిరసన తెలుపుతూ.. అంబాలా నగర పాలక సంస్థ ఎన్నికల్లో ప్రచారానికి వెళుతున్న సీఎం ఖట్టర్‌ కాన్వాయ్‌లో అంబులెన్స్‌ మినహా అన్ని వాహనాలపై కర్రలతో దాడి చేశారని తెలుస్తున్నది. అయితే సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌కు ఎటువంటి ప్రమాదం జరుగలేదు.

సీఎం ఖట్టర్‌ పర్యటన కోసం హర్యానా రాష్ట్ర అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసినా.. అంబాలా వద్ద నిరసనకారులు అడ్డుకున్నారు. సీఎం కాన్వాయ్‌ను దారి మళ్లించడానికి పోలీసు అధికారులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు పోలీసు అధికారులు ప్రయత్నించినప్పుడు ఒక రైతు టర్బన్‌ గాలిలో ఎగిరింది. దీంతో ఆందోళనకారుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. హర్యానాలోని బీజేపీ, జన నాయక జనతా పార్టీ (జేజేపీ) నేతలకు నిరసన తెలుపాలని నిర్ణయించామని రైతులు వెల్లడించారు.