పవన్ కళ్యాణ్ జన్మదినాన ఐదు సామాజిక సేవా కార్యక్రమాలు

• జనసేనాని మనసుకి నచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ
• మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం
• పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ వెల్లడి

‘జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రతి అడుగు ప్రజాక్షేమం కోసమే వేస్తారు. ప్రతి కార్యకర్త తోటి వారికి సాయపడాలన్న అత్యున్నత లక్ష్యంతో ప్రయాణం సాగిస్తారు. మహోన్నత వ్యక్తిత్వం ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా, సమాజానికి మంచి చేసే విధంగా, ఆయన మనసుకు నచ్చే విధంగా ఐదు అంశాలతో కూడిన కార్యక్రమాలకు రూపకల్పన చేశామ’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు.. ఒకే సమయంలో నిర్వహించాలని కోరారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 2వ తేదీ మంగళగిరి కార్యాలయం వేదికగా నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరంలో తాను స్వయంగా పాల్గొననున్నట్టు శ్రీ మనోహర్ గారు తెలిపారు. సోమవారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గం, జిల్లాలు, నగర అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంఛార్జులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ “శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఐదు అంశాలతో కూడిన సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి జనసైనికుడు, వీర మహిళ పాలు పంచుకోవాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రయాణంలో గుర్తించిన అంశాల ఆదారంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించాము. భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనాలు, రెల్లి కాలనీలు సందర్శించి వారి మధ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడంతోపాటు వారికి నూతన వస్త్రాలు, భోజన ఏర్పాట్లు లాంటివి చేయడం, రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాల నిర్వహణ, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు సందర్శించి విద్యార్ధులకు పుస్తకాలు, స్టేషనరీ అందచేయడం, దివ్యాంగులకు సహాయం చేసే కార్యక్రమాలు చేపట్టండి. ఈ ఐదు అంశాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నచ్చే కార్యక్రమాలు. బైకు ర్యాలీలు, కేకు కటింగులకు సమయం వృథా చేయకుండా.. ఐదు అంశాల్లో ఏ కార్యక్రమం చేపట్టినా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంతోషిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరఫున నిర్వహించే ఈ కార్యక్రమాలు పది మందికి తెలిసే విధంగా ముందుకు తీసుకువెళ్దాం. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కార్యక్రమాల వివరాలు ఫోటోలు, వీడియోల రూపంలో పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలి. ఓ ప్రత్యేక హ్యాష్ ట్యాగ్ ద్వారా ఈ కార్యక్రమాలపై డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిద్దాం” అని తెలిపారు.