యాదాద్రిలో వైభవంగా గోదాదేవి కల్యాణం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం రాత్రి గోదాదేవి- శ్రీరంగనాథస్వామి కల్యాణం కనులపండువగా కొనసాగింది. కల్యాణ తంతును వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కమనీయంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ఈఓ గీత, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహ్మమూర్తి, రంగనాథుడు- గోదాదేవికి పట్టువస్ర్తాలను సమర్పించారు. కల్యాణం అనంతరం దేవతామూర్తులను ప్రత్యేక సేవపై ఊరేగించారు.

ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో నెలరోజులుగా గోదాదేవి తిరుప్పావై వ్రతాన్ని అర్చకులు నిర్వహించారు. నాలుగు రోజులుగా అమ్మవారికి నిరటోత్సవం చేపట్టిన అర్చకులు గురువారం రాత్రి గోదాదేవిని, శ్రీరంగనాథ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి సేవపై ఊరేగించారు. కల్యాణమూర్తులుగా తీర్చిదిద్ది శ్రీరంగనాథుడిని గోదాదేవితో కల్యాణ వేడుక జరిపించారు. ఈ కల్యాణ తంతును వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తుల తరలివచ్చారు.