గౌరవం దక్కిన సంతోషంతో ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాను: రాణి

దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌ ఖేల్ రత్న కు తన పేరును ప్రకటించాక కన్నీటిని ఆపుకోలేకపోయానని భారత మహిళల జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌ చెప్పింది. మహిళా హాకీ ప్లేయర్‌కు ఆ అవార్డు దక్కుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదని, అలాంటిది తనకే ఆ గౌరవం దక్కడంతో సంతోషంతో ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయానని బుధవారం ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ‘నిజం చెప్పాలంటే, ఓ మహిళా హాకీ ప్లేయర్‌గా ఖేల్ రత్న అవార్డు నాకు వస్తుందని అంచనా వేయలేదు. కానీ నాకు అవార్డు ప్రకటించగానే భావోద్వేగానికి లోనయ్యా. కన్నీటిని ఆపుకోలేకపోయా. మా నాన్నకు ఫోన్‌ చేసి వార్త చెప్పా. ఏడుస్తూనే మాట్లాడా. ఇక ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం తేవడమే నా తదుపరి లక్ష్యం’ అని రాణి చెప్పింది. టోక్యో ఒలింపిక్స్‌కు భారత మహిళల జట్టు అర్హత సాధించడంలో రాణి ప్రధానపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.