చైనా ను ఢీ కొనేందుకు ఎల్ఏసీ వద్ద సరికొత్త ‘నిర్భయ్ మిస్సైల్‌’ను మోహరించిన భారత్

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద యుద్ధసామాగ్రి మోహరింపు ముమ్మరంగా సాగుతోంది. భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు చైనా 2000 కి.మీ వరకు పరిధి గల లాంగ్‌ రేంజ్‌, సర్ఫేస్‌ టు ఎయిర్‌ క్షిపణులను తూర్పు లదాఖ్‌ ప్రాంతానికి తరలించింది.  భారత్ సైతం డ్రాగన్ కు ధీటుగా సమాధానమిచ్చేందుకు అత్యాధునిక, సరికొత్త ‘నిర్భయ్ మిస్సైల్’ను సరిహద్దుకు తరలించింది. ఈ విషయాన్ని ఆర్మీ వర్గాలు సోమవారం ఖరారు చేశాయి. నిర్భయ్ తోపాటు ప్రఖ్యాత బ్రహ్మోస్, ఆకాశ్(సర్ఫేస్ టు ఎయిర్) మిస్సైళ్లను సైతం ఎల్ఏసీ వద్ద మోహరించారు.

కాగా, వీటిలో 500 కి.మీ పరిధి గల బ్రహ్మోస్ క్రూయిజ్‌ క్షిపణిని అత్యవసర పరిస్థితుల్లో చైనాపై ప్రయోగించే బ్రహ్మాస్త్రంగా భారత్‌ భావిస్తోంది. రష్యా సహకారంతో తయారుచేసిన బ్రహ్మోస్ క్షిపణులను భారత్‌ ‘తగిన’ సంఖ్యలో లద్దాఖ్‌ వద్దకు తరలించినట్టు తెలిసింది. ఇక ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే 800 కి.మీ పరిధి గల నిర్భయ్‌ సబ్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి.. 100 మీటర్ల నుంచి నాలుగు కి.మీ ఎత్తులో ఎగురుతూ నేలపై ఉన్న లక్ష్యాలను గుర్తించి, ఛేదించటంలో దిట్ట. కాగా, చైనా వాయు సేనను ఎదుర్కొనేందుకు వినియోగించనున్న ఆకాశ్‌.. ఒకేసారి 64 లక్ష్యాలపై నిఘా ఉంచుతూ, వాటిలో పన్నెండింటిపై ఒకేసారి దాడిచేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది.