India Vs England: టీమిండియా ముందు భారీ టార్గెట్..

చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్ట్‌లో టీమిండియా గట్టెక్కడానికి పోరాడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే నాలుగో రోజు ఆట ముగిసింది. 420 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. త్వరగానే రోహిత్ (12) వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో పుజారా (12), శుభ్‌మన్ గిల్ (15) ఉన్నారు. మరో రోజు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఇంగ్లండ్ 9 వికెట్ల కోసం చూస్తుండగా.. ఇండియా కనీసం డ్రా అయినా చేసుకోవాలని భావిస్తోంది. విజయానికి టీమిండియా ఇంకా 381 పరుగుల దూరంలో ఉంది. చివరి రోజు ఇన్ని పరుగులు చేయడం దాదాపు అసాధ్యం.

అంతకముందు 241 పరుగుల ఆధిక్యంతో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్‌ను.. అశ్విన్ బెంబేలెత్తించాడు. ఇంగ్లాండ్ భారీ టార్గెట్ నిర్దేశించకుండా నిలువరించాడు. కీలకమైన ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లీష్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియాకు 420 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. రూట్(40) మరోసారి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోర్ వివరాలు..

ఇక తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 337 పరుగులకు ఆలౌట్ అయింది. 257/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 80 పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వాషింగ్టన్ సుందర్(85*) రాణించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బెస్ నాలుగు వికెట్లు.. ఆర్చర్, లీచ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ వివరాలు..

అంతకముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. కెప్టెన్ జో రూట్(218: 377 బంతుల్లో 19×4, 2×6) సూపర్ డబుల్ సెంచరీతో ఇన్నింగ్స్‌కి వెన్నుముకగా నిలవగా.. ఓపెనర్ సిబ్లీ(87: 286 బంతుల్లో 12×4, 0x6), ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(82: 118 బంతుల్లో 10×4, 3×6) మంచి భాగస్వామ్యాలను నెలకొల్పడంలో సహాయపడ్డారు. అటు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బెస్(34) కూడా రాణించడంతో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోర్ సాధించింది. టీమిండియా బౌలర్లలో ఇషాంత్, నదీమ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీశారు. కాగా, టీమిండియా ఫాలో ఆన్ గండం దాటాలంటే మరో 122 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం భారత్ జట్టు ఆశలన్నీ కూడా క్రీజులో ఉన్న అశ్విన్, సుందర్‌పైనే ఉన్నాయి.