ప్లేఆఫ్కు చేరిన తొలి జట్టు ముంబై
అద్భుత ప్రదర్శనతో ముంబై ఇండిన్స్ అదరగొట్టింది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్లో బెంగళూరును అయిదు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో 13వ సీజన్లో ప్లేఆఫ్కు చేరిన తొలి జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 45 బంతుల్లో 74 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరు అందించాడు. 12 బౌండరీలు, 1 సిక్సర్తో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అనంతరం బరిలోకి దిగిన ముంబై 19.1 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ (79/ 43 బంతుల్లో, 10×4, 3×6) హాఫ్ సెంచరీ పూర్తి చేసి అజేయంగా నిలిచాడు.
టార్గెట్ ఛేదనకు దిగిన ముంబైకి గొప్ప ఆరంభమేమి లభించలేదు. డికాక్ను సిరాజ్ ఔట్ చేయడంతో 37 పరుగులకు తొలివికెట్ కోల్పోయింది. కొద్దిసేపటికే ఇషాన్ కిషన్ (25), సౌరభ్ తివారి కూడా వెనుదిరిగారు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన కృనాల్ పాండ్యతో కలిసి సూర్యకుమార్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు.
అయితే కృనాల్ను చాహల్ ఔట్ చేసి ముంబైకి కొంత బయపెట్టే ప్రయత్నం చేశాడు. వికెట్లు పడుతున్నా మరోవైపు సూర్యకుమార్ తన పోరాటం కొనసాగించాడు. రన్రేటు నియంత్రణలోనే ఉంచుతూ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. హార్దిక్ 19వ ఓవర్లో వెనుదిరిగాడు. బెంగళూరు బౌలర్లలో చాహల్, సిరాజ్ చెరో రెండు వికెట్లు, మోరిస్ ఒక వికెట్ తీశాడు.