రేపు ఢిల్లీ పర్యటనకు జగన్.. అమిత్ షాతో భేటీ!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన రేపు ఖరారైనట్టు తెలుస్తోంది. నిజానికి రెండు రోజుల క్రితమే ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో వెళ్లలేకపోయారు. తాజాగా ఆయన అపాయింట్మెంట్ ఖరారు కావడంతో రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులను ఆయన కలిసే అవకాశం ఉంది. మూడు రాజధానుల ఏర్పాటుకు సహకారం కోరడంతోపాటు పోలవరం ప్రాజెక్టు బకాయిలను విడుదలపై జలశక్తి మంత్రితో సీఎం చర్చించే అవకాశం ఉంది. అలాగే, కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా ఆదుకోవాలని జగన్ ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో రేపటి జగన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.