ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్న జ‌గ‌న్.. ఏపీలోని 17 పంచాయతీలకు అవార్డులు

పంచాయ‌తీరాజ్ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ రోజు నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌, మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్య‌క్రమంలో ఇత‌ర రాష్ట్రాల సీఎంలు పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రులు కూడా పాల్గొన్నారు. ఏపీలోని 17 పంచాయ‌తీల‌కు జాతీయ అవార్డులు ద‌క్కిన విష‌యం తెలిసిందే. రాష్ట్రాల‌కు ద‌క్కిన‌ అవార్డుల‌ను వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో మోదీ అందజేశారు.

ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధి కోసం పాటించాల్సిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను తాము ప్ర‌క‌టించామ‌ని గుర్తు చేశారు. వాటి ప్ర‌కారం గ్రామాల అభివృద్ధి సాధ్యప‌డుతుంద‌ని చెప్పారు. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో దేశంలోని ప్ర‌తి గ్రామానికి వ్యాక్సిన్లు అందేలా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు.

గ‌త ఏడాది పంచాయ‌తీరాజ్ దినోత్స‌వం సంద‌ర్భంగా ఇదే స‌మ‌యంలో  దేశంలో క‌రోనా విజృంభిస్తోన్న నేప‌థ్యంలో దాని క‌ట్ట‌డికి కృషి చేయాల‌ని తాను పిలుపునిచ్చాన‌ని, గ్రామాలు అందుకు కృషిచేశాయ‌ని గుర్తు చేసుకున్నారు.