కుటుంబం కోసం ఆరాటం.. చిరుతతో పోరాటం..

బెంగళూరు: భార్య, కుమార్తెను కాపాడుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా చిరుతపులితో తలపడి దాన్ని చంపేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని హసన్‌ జిల్లా హరిసెక్రె తాలుకా బెండాక్రె ప్రాంతంలో చోటు చేసుకుంది. భార్య, కుమార్తెతో ద్విచక్రవాహనంపై వెళుతున్న రాజ్‌గోపాల్‌ నాయక్‌పై పులి ఒక్కసారిగా దూకింది. ఈ క్రమంలో ముగ్గురు బైకు మీద నుంచి కిందపడిపోయారు. వెంటనే చిరుతపులి వారిపై దాడి చేసింది. చిరుత బారి నుంచి భార్య, కుమార్తెను రక్షించుకునేందుకు రాజ్‌గోపాల్‌ నాయక్‌ వీరోచిత పోరాటం చేశాడు. చివరికి దాన్ని హతమార్చి తమ ప్రాణాలను రక్షించుకున్నాడు. అప్పటికే పులి దాడిలో తీవ్రంగా గాయపడిన అతని భార్య, కుమార్తెతో సహా రాజ్‌గోపాల్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.