అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన భారత్

కరోనా నేపథ్యంలో ప్రత్యేక పరిస్థతులను దృష్టి లో ఉంచుకుని అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఆగస్టు 31 వరకు కేంద్రం పొడిగించింది. జూలై 31తో అంతర్జాతీయ విమానాలపై నిషేధం ముగియనుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు వందే భారత్‌ మిషన్‌ కింద నడుస్తున్న విమానాలు మునుపటిలాగే తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయని తెలిపారు. దేశాలతో ద్వైపాక్షిక ఎయిర్‌ బబుల్‌ ఒప్పందాల ప్రకారం నడుస్తున్న విమానాలు కూడా యథావిధిగా కొనసాగుతాయన్నారు. యుఎస్‌, యుకె, యుఎఇ, కెన్యా, భూటాన్‌, ఫ్రాన్స్‌ సహా ప్రపంచంలోని 28 దేశాలతో భారత్‌కు ఎయిర్‌ బబుల్‌ ఒప్పందం ఉంది. అలాగే కొన్ని కార్గో విమానాలకు కూడా నిషేధం వర్తించదని డిజిసిఎ స్పష్టం చేసింది.