మద్దాలి గిరి, ముస్తఫా తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలి

  • గంజాయిపై ఉక్కుపాదం మోపాలి
  • పోలీసు విధుల్లో వైసీపీ నేతల జోక్యం తగ్గాలి.
  • బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి.
  • గుంటూరు అర్బన్ జనసేన పార్టీ డిమాండ్

గుంటూరు, గంజాయి మత్తులో మైనర్ యువకులు చేసిన హత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాలి గిరి, మహమ్మద్ ముస్తఫా వెంటనే తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి డిమాండ్ చేశారు. మద్యం, గంజాయి మత్తులో దొంగలు చేసిన హత్యలకు, దాడులకు నిరసనగా జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ళ సురేష్ ఆదేశాల మేరకు గురువారం హిమని సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ రాక్షస పాలన – మాకొద్దు
ఈ అరాచక పాలన – మాకొద్దు
ఈ అసమర్ధ పాలన – మాకొద్దు
గంజాయి రహిత ఆంద్రప్రదేశ్ కావాలంటే- ఈ జగణాసురుని పాలన పోవాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన బటన్ నొక్కటానికే పరిమతమైందని విమర్శించారు. రాత్రి పది దాటితే ప్రజలు బయట తిరగాలి అంటేనే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాల వ్యాపారంలో కొందరు వైసీపీ నేతలే భాగస్వామ్యులుగా ఉండటం హేయమన్నారు. వక్కపొడి దొరికినంత సులువుగా గంజాయి పొట్లాలు దొరుకుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. నగర శివారు ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటున్నాయని పోలీసులు ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసు వ్యవస్థలో వైసీపీ నేతల మితిమీరిన జోక్యం సరికాదని నగర ఉపాధ్యక్షులు కొండూరి కిషోర్, చింతా రాజు అన్నారు. ఇప్పటికైనా గంజాయి, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాల పై పోలీసులు ఉక్కుపాదం మోపాలని కోరారు. పరిపాలన చేతకాని ఒక అసమర్ధుని పాలనలో రాష్ట్రం అతలాకుతలం అవుతుందని నగర ప్రధాన కార్యదర్శిలు యడ్ల నాగమల్లేశ్వరరావు, ఆనంద్ సాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందచేయాలని వారు డిమాండ్ చేశారు. తొలుత వీర మహిళలు మల్లీశ్వరి, కవిత, ఆషా, అరుణలు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు, డివిజన్ కమిటీ అధ్యక్షులు, వీరమహిళలు జనసైనికులు పాల్గొన్నారు.