మధ్యప్రదేశ్‌ ప్రమాద ఘటనలో 49కి చేరిన మృతులు

మధ్యప్రదేశ్‌లో బస్సు కాలువలో బోల్తాపడిన సంఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. కాలువ నుంచి మరో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక బృందాలు వెలికి తీశాయి. దీంతో మృతుల సంఖ్య 49కి పెరిగింది. సిధి నుంచి సాత్నాకు వెళ్తున్న క్రమంలో పట్నా గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది వరకు ఉన్నారని అంచనా. ఘటనలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడగా.. 49 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గల్లంతయ్యారని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.