కరోనా కట్టడికి భారీ ప్రయోగాలు చేస్తోన్న మోడెర్నా సంస్థ

 కరోనా నిర్మూలనకు రూపొందించిన వ్యాక్సిన్‌ ‘ఎంఆర్‌ఎన్‌ఏ-1273’ తుది దశ ట్రయల్స్‌ను అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ  పెద్ద ఎత్తున ప్రారంభించింది. ‘కోవె స్టడీ (కరోనావైరస్‌ ఎఫికసీ స్టడీ)’ పేరుతో అమెరికాలోని 70కి పైగా ప్రాంతాల్లో 30వేల మంది వలంటీర్లపై ట్రయల్స్‌ను మొదలు పెట్టింది. కరోనా వ్యాక్సిన్లకు ప్రపంచంలో ఇదే అతి పెద్ద ట్రయల్‌. మోడెర్నా సంస్థ వ్యాక్సిన్‌ తయారీని మొదలుపెట్టిన 2 నెలల్లోనే మానవ ప్రయోగాల దశకు చేరింది. తొలి దశ ప్రయోగాల్లో కొన్ని దుష్ప్రభావాలు(కొద్దిపాటి జ్వరం, చలి-వణుకు, ఇంజెక్షన్‌ చేసిన చోట నొప్పి వంటివి) కనిపించినప్పటికీ, మొత్తంగా ప్రోత్సాహకర ఫలితాలనే చూపింది. అయితే, వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని, అది సురక్షితమనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి భారీ ప్రయోగాలు అవసరమని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. మోడెర్నా కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌ డిసెంబరు కల్లా అందుబాటులోకి వస్తుందని అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌(ఎన్‌ఐహెచ్‌) డైరెక్టర్‌ ఫ్రన్సిస్‌ కాలిన్స్‌ తెలిపారు.