జయప్రకాష్ రెడ్డి మృతికి సంతాపం తెలిపిన మోడీ, అమిత్ షా

టాలీవుడ్ ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి మరణం సినీఇండస్ట్రీని శోకసంద్రంలోకి నెట్టింది. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో తన నివాసంలోని బాత్‌రూమ్‌లోనే జయప్రకాష్ రెడ్డి కుప్పకూలిపోయారు. ఆయన అకాల మరణాన్ని సినీతారలు, ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. సినీప్రముకులంతా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధనలు చేస్తున్నారు. జయప్రకాశ్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతీ తెలుపుతున్నారు. తాజాగా జయప్రకాశ్ రెడ్డి మృతి పై ప్రధాని నరేంద్రమోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. “జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు. తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి.” అని ట్వీట్ చేశారు.

అదేవిధంగా అమిత్ షా స్పందిస్తూ … ” గొప్ప ప్రతిభ గల తెలుగు నటుడు శ్రీ జయప్రకాష్ రెడ్డి గారి అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. విలక్షణ పాత్రలతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవ చిరస్మరణీయం.పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన స్థానం భర్తీ చేయలేనిది. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం.” అంటూ ట్వీట్ చేశారు.