ఆజాద్‌ వీడ్కోలుపై… కన్నీటి పర్యంతమైన ప్రధాని

రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోడీ కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, విపక్ష నేత అయిన గలాంనబీ ఆజాద్‌ ఫిబ్రవరి 15వ తేదీతో ఆయన పదవీ కాలం ముగియనుంది. ఈ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో ప్రధాని మోడీ ఆయన గురించి మాట్లాడుతూ.. ఉద్వేగానికి గురయ్యారు. ఆజాద్‌ తనకు ఎప్పటి నుంచో తెలుసని అన్నారు. ‘ఉద్యోగాలు, పదవులు, అధికారాలు వస్తాయి.. పోతాయి.. కానీ వాటిని ఎలా నిర్వహించాలో గులాం నబీ ఆజాద్‌ను చూసి నేర్చుకోవాలి’ అని అన్నారు. అలాగే వారి మధ్య ఉన్న సంబంధమెలాంటిదో ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాను గుజరాత్‌ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు.. జమ్మూకాశ్మీర్‌లో గుజరాతీ యాత్రికులపై ఉగ్రదాడి జరిగినప్పుడు.. ఆజాద్‌ రాత్రిపూట తనకు ఫోన్‌ చేసి ఆ దాడి గురించి చెబుతూ కన్నీటి పర్యంతమైనట్లు తెలిపారు. అప్పుడు రక్షణమంత్రిగా ప్రణబ్‌ముఖర్జీ ఉన్నారు. ఆ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల మృతదేహాలను గుజరాత్‌కు తరలించాలని ప్రణబ్‌దా భారత వాయుసేనను కోరారు. ఆ తర్వాత ఆజాద్‌ మళ్లీ తనకు ఫోన్‌ చేసి.. ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నట్లు చెప్పారు. ఆయన తనకు నిజమైన స్నేహితుడని అన్నారు. ఆజాద్‌ ప్రతి ఒక్కరినీ తన కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటారని అన్నారు.

ఈ సందర్భంగా… రాజ్యసభలో ఆజాద్‌ స్థానాన్ని భర్తీ చేసే నేత ఎవరూ లేరని కొనియాడారు. ఆయన కేవలం పార్టీ కోసమే గాక.. సభ, దేశం కోసం ఆందోళ చెందే వ్యక్తి అని ప్రశంసించారు. ఆయనను ఎప్పటికీ రిటైర్‌ అవనివ్వబోనని, ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటానని ప్రధాని తెలిపారు. ఆజాద్‌తోపాటు పలువురు రాజ్యసభ సభ్యులు కూడా వచ్చేవారం పదవీ విరమణ పొందుతున్నారు.