ఒకే ఒక్క కొవిడ్‌ కేసు.. దేశ వ్యాప్తంగా 3 రోజుల లాక్ డౌన్..

కొవిడ్‌ కట్టడి విషయంలో న్యూజిలాండ్‌ మొదటి నుంచి అప్రమత్తంగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ దేశంలోని ఆక్లాండ్‌లో ఒక కరోనా కేసు వెలుగుచూసింది. దీంతో వైరస్‌ వ్యాప్తి నియంత్రణకుగానూ దేశవ్యాప్తంగా మూడు రోజులపాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రధాని జెసిండా ఆర్డెర్న్ మంగళవారం ప్రకటించారు. ‘ఈ కేసును డెల్టా వేరియంట్‌గా అనుమానిస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరమైనది. మేం దానికి తగినట్లు స్పందిస్తున్నాం. ఎంత వీలైతే అంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నామ’ని జెసిండా తెలిపారు. ఆస్ట్రేలియాలో డెల్టా వేరియంట్‌ విజృంభణను ఉటంకిస్తూ.. అలాంటి పరిస్థితులు మాకు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్ల చెప్పారు.

ఏడాది తర్వాతా లాక్‌డౌన్‌..

దాదాపు ఏడాది తర్వాత ఇక్కడ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడం గమనార్హం. సదరు వ్యక్తి కొవిడ్‌ టీకా తీసుకోలేదని, ఆగస్టు 12 నుంచి వైరస్‌తో బాధపడుతున్నట్లు గుర్తించామని ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఆష్లే బ్లూమ్‌ఫీల్డ్ తెలిపారు. అతను తన భార్యతో కలిసి వారాంతంలో స్థానికంగా పర్యటించాడని.. రగ్బీ ఆటను చూసేందుకు వెళ్లాడని చెప్పారు. దీంతో ఏడు రోజులపాటు లాక్‌డౌన్‌ విధించినట్లు చెప్పారు. మరోవైపు స్థానికంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెమ్మదిగా ఉండటంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి.