పద్మశ్రీ వనజీవి రామయ్య గారిని ఫోన్లో పరామర్శించిన పవన్ కళ్యాణ్

రోడ్డు ప్రమాదానికి గురై ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పర్యావరణ ప్రేమికులు పద్మశ్రీ వనజీవి రామయ్యని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఫోన్లో పరామర్శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ సుమన్ ఆదివారం సాయంత్రం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి శ్రీ రామయ్య ఆరోగ్య, యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీడియో కాల్ ద్వారా పవన్ కళ్యాణ్ – వనజీవి రామయ్యతో మాట్లాడారు. ‘చెట్లను పెంచడం, పచ్చదనాన్ని కాపాడడం కోసం మీరు చేస్తున్న సేవ నాకు ఎంతో స్ఫూర్తిని కలిగించింది. కోలుకుని పర్యావరణ పరిరక్షణకు పునరంకితం కావాలి. త్వరలో మిమ్మల్ని కలుస్తాను’ అని చెప్పారు. రామయ్య మనవడితోనూ మాట్లాడారు. వైద్య సేవలు అందిస్తున్న డి.ఎమ్.హెచ్.ఒ. డా. మాలతి, వైద్య నిపుణులు డా.సురేష్, డా. రాజశేఖర్ గౌడ్, డా.లక్ష్మణ్, డా. రాంప్రసాద్ లతో డా. సుమన్ మాట్లాడారు.