బెంగాల్ లో 8 దశల పోలింగ్ పై సుప్రీంలో పిటిషన్..

బెంగాల్​ అసెంబ్లీ ఎన్నికలను 8 విడతల్లో నిర్వహించాలన్న ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం ఆర్టికల్ 14, ఆర్టికల్ 21కు విఘాతం కలిగిస్తోందని పిటిషనర్, న్యాయవాది ఎంఎల్ శర్మ పేర్కొన్నారు. కాబట్టి ఎనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. త్వరలో ఈ పిటిషన్ విచారణకు రానుంది. అదే సమయంలో.. బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మతపరమైన నినాదాలు చేయడంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని పిటిషనర్ శర్మ కోరారు. ఈ నినాదాల వల్ల సమాజంలో సామరస్యం దెబ్బతింటోందని అన్నారు. ఇది ఐపీసీతో పాటు, 1951 ప్రజా ప్రతినిధుల చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. బెంగాల్తో పాటు మరో మూడు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా.. అసోంలో మూడు, బంగాల్లో ఎనిమిది దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది.