సైనిక పాటవాన్ని చాటిన గణతంత్ర వేడుకలు!

ప్రతి సంవత్సరమూ జరిగేంత ఆర్భాటంగా కాకున్నా, 72వ భారత గణతంత్ర వేడుకలు న్యూఢిల్లీలోని రాజ్ పథ్ లో సైనిక పాటవాన్ని చాటుతూ ఘనంగా జరిగాయి. తొలుత సంప్రదాయం ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు, జాతీయ యుద్ధ వీరుల స్మారక స్థూపాన్ని సందర్శించి, అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ, తన సందేహాన్ని రాశారు.

ఆ వెంటనే రాజ్ పథ్ లో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్న ప్రధాని, ఒక్కొక్కరుగా వచ్చిన అతిథులను స్వాగతించారు. రాష్ట్రపతి కాన్వాయ్ రాగానే, ఆయనకు నమస్కరించి, స్వాగతం పలికి, వేదికపైకి తోడ్కొని వెళ్లారు. ఆపై 21 గన్ సెల్యూట్, జాతీయ గీతాలాపన అనంతరం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం సమర్పించారు.

ఆ తరువాత వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఫ్రాన్స్ నుంచి గత సంవత్సరం ఇండియా దిగుమతి చేసుకున్న రఫేల్ యుద్ధ విమానాలు తొలిసారిగా గణతంత్ర పరేడ్ లో పాల్గొన్నాయి. ఇవి చేసిన వర్టికల్ చార్లీ విన్యాసాలను చప్పట్లో స్వాగతిస్తూ వీక్షకులు తిలకించారు. లక్షల మంది ప్రత్యక్షంగా చూడాల్సిన ఈ క్షణాలను వేల మంది మాత్రమే వీక్షించగా, కోట్లాది మంది టీవీ చానెల్స్, వెబ్ మీడియా ద్వారా తిలకించారు.