RR vs KKR: రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తుచేసిన కోల్‌కతా నైట్ రైడర్స్

కీలక మ్యాచ్‌లో కోల్‌కతా ఆటగాళ్లు చెలరేగిపోయారు. రాజస్థాన్‌పై భారీ విజయం సాధించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభమన్‌ గిల్‌ హాఫ్‌ సెంచరీతో.. వెంకటేశ్‌ అయ్యర్‌ 38 పరుగులతో రాణించారు. తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్ కూడా బ్యాట్‌కు పనిచెప్పారు. దినేశ్‌ కార్తీక్‌ , మోర్గాన్‌ నాటౌట్‌గా నిలిచారు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సంజు సేన..85 పరుగులకే కుప్పకూలింది.

రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌లో రాహుల్ తెవాతియా ఒక్కడే 44 రన్స్‌తో రాణించాడు. రాజస్థాన్‌కు తొలి ఓవర్లోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ డకౌట్ అయ్యాడు. సంజు శాంసన్‌ ఒక్క పరుగే చేశాడు. అనుజ్‌ రావత్, మోరిస్‌ కూడా పరుగులేమీ చేయకుండానే పెవిలీయన్ చేరారు. చి¤వరిదాకా రాహుల్ ఒక్కడే పోరాటం చేశాడు. కోల్‌కతా బౌలర్లలో శివమ్‌ మావి నాలుగు, ఫెర్గూసన్‌ మూడు వికెట్లు తీశారు. ఈ విజయంతో కోల్‌కతా ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపరుచుకుంది. హైదరాబాద్‌తో ఈరోజు జరిగే మ్యాచ్‌లో ముంబయి 171 పరుగుల తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌కి వెళుతుంది. లేదంటే కోల్‌కతా ప్లేఆఫ్స్‌కి చేరినట్టే.