ఎస్పీ బాలు ఆరోగ్యం విషమం.. ఎంజీఎం ఆస్పత్రికి కమల్‌హాసన్‌..

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యపరిస్థితి మరోసారి విషమించింది. బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఆయనకు చికిత్సనందిస్తున్న ఎంజీఎం ఆసుపత్రి ప్రకటించింది. తాజాగా.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని ఆసుపత్రి వెల్లడించింది. ఆయనకు ఎక్మోతో పాటు ఇతర ప్రాణాధార చికిత్సనందిస్తున్నట్లు ఎంజీఎం అధికారికంగా ప్రకటించింది.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియగానే, నటుడు, రాజకీయ నాయకుడు కమల్‌హాసన్‌ గురువారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లారు. ఎక్మోతో పాటు, ఆయనకు ప్రాణాధార వ్యవస్థ ద్వారా చికిత్స అందిస్తున్నామని ఎంజీఎం వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. బాలు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు, ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.