ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 195/6

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆరు వికెట్లు కోల్పోయింది. వరుస ఓవర్లలో పంత్‌, పుజారా ఔటయ్యారు. తొలుత హేజిల్‌వుడ్‌ వేసిన 88వ ఓవర్‌లో పుజారా(50; 176 బంతుల్లో 5×4) అర్ధశతకం సాధించగా అదే ఓవర్‌లో రిషభ్‌పంత్‌(36; 67 బంతుల్లో 4×4) స్లిప్‌లో వార్నర్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 195 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. వీరిద్దరూ 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక కమిన్స్‌ వేసిన తర్వాతి ఓవర్‌లోనే పుజారా కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో భారత్‌ అదే స్కోర్‌ వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో జడేజా, అశ్విన్‌ ఉన్నారు. 89 ఓవర్లకు టీమ్‌ఇండియా 195/6తో కొనసాగుతోంది.

అంతకుముందు 96/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రహానె(22), పుజారా మూడో రోజు ఆటను ప్రారంభించారు. వారిద్దరూ 21 పరుగులు జోడించాక రహానె మూడో వికెట్‌గా వెనుతిరిగాడు. కమిన్స్‌ వేసిన 55వ ఓవర్‌లో బౌల్డయ్యాడు. ఆపై మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ విహారి(4) విఫలమయ్యాడు. 68వ ఓవర్‌లో అనవసరపు పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. దీంతో భారత్‌ 142 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఆపై పుజారా, పంత్‌ ఐదో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.