రైల్వేలైన్ పనుల పై సమీక్ష జరిపిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మనోహరాబాద్ రైల్వేలైన్ పనులను వేగవంతం చేయాలని గజ్వేల్ రైల్వే స్టేషన్ పనులు పూర్తి అయినందున ప్రయోగాత్మకంగా రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రైల్వే, రెవెన్యూ, విద్యుత్తు శాఖ అధికారులతో పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. పనులు వేగంగా జరగాలంటే వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని ఆయన సూచించారు. అలాగే మనోహరాబాద్ పాత రైల్వే స్టేషన్ వద్ద అండర్ పాస్ ప్యాచ్ వర్క్ పనులను సైతం జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. రైల్వే లైను పనులు జరిగే చోట విద్యుత్ లైన్లు మార్చాల్సి వస్తే ఆ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా మనోహరాబాద్‌ రైల్వే లైన్‌కు సంబంధించిన భూసేకరణ పనులను పూర్తి చేయాలన్నారు. అదే విధంగా సిద్దిపేట రైల్వేస్టేషన్ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు.