ఏపీలో పది పరీక్షలు వాయిదా పడే అవకాశం..?

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా జూన్ 7వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కావాల్సి ఉండగా.. నెల రోజుల పాటు వాయిదా వేయాలంటూ పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రెండు లేదా మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు.

రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీ వరకు కర్ఫ్యూ అమలులో ఉండటం, అలాగే కొన్ని పాఠశాలలు క్వారంటైన్ కేంద్రాలుగా మార్పు చెందటంతో.. ఈ పరిస్థితుల్లో పరీక్షలకు ఏర్పాటు చేయడం కష్టతరమని విద్యాశాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది. అలాగే పది పరీక్షలపై వివిధ రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలను సైతం అందులో ప్రస్తావించింది.

ఇదిలా ఉంటే ఒకవేళ పరీక్షలు వాయిదా పడితే.. భవిష్యత్తులో తీసుకునే నిర్ణయం కోసం అధికారులు ముందుగానే ఇంటర్నల్ మార్కులు నమోదు చేసే పనిలో పడ్డారు. కాగా, ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరాఖండ్, హరియానా, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు పది పరీక్షలను రద్దు చేయగా.. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గోవా, రాజస్తాన్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.