వ్యాక్సిన్ కోసం సీరం సంస్థకు ఆర్డర్ ఇచ్చిన కేంద్రం

భారత్ లో ఈ నెల 16 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ అమలు కానుంది. ఇప్పటికే కొవిషీల్డ్ (ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా), కొవాగ్జిన్ (భారత్ బయోటెక్-ఐసీఎంఆర్) వ్యాక్సిన్లకు దేశంలో అత్యవసర అనుమతులు మంజూరయ్యాయి. ఈ క్రమంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం సీరం సంస్థకు ఆర్డర్ ఇచ్చింది. వ్యాక్సిన్ కావాలంటూ కేంద్రం తమకు ఆర్డర్ ఇచ్చిన విషయాన్ని సీరం సంస్థ నిర్ధారించింది.

అటు, వ్యాక్సిన్ పంపిణీకి అట్టే సమయం లేకపోవడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కొవిషీల్డ్ టీకాను అధికారులు సరఫరా కేంద్రాలకు తరలిస్తున్నారు. పుణేలోని సీరం సంస్థ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వ్యాక్సిన్ల రవాణా ప్రారంభించారు. ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను పుణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారీ ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.